మనదేశం, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీ ప్లీనరీకి, బీసీ సభలకు ఆర్టీసీ బస్సులను భారీగా వాడుకున్నారు. అయితే వాటికి పూర్తి అద్దె చెల్లించకుండా అడ్డదారిలో రాయితీలు పొందినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం వల్ల ఆర్టీసీకి రూ. 1.66 కోట్ల నష్టం రాగా.. జీఎస్టీ వసూలు చేయకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు మరో రూ. 1.57 కోట్ల గండి పడింది.
శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. 2022 జులైలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరిగిన వైసీపీ ప్లీనరీ కోసం వివిధ జిల్లాల నుంచి ఏకంగా 1,823 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. అయితే, వీటికి స్పెషల్ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా.. ఆర్టీసీ అధికారులు మాత్రం కేవలం సాధారణ ఛార్జీలే తీసుకున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా 10 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చేశారు. దీనివల్ల ఆర్టీసీకి ఏకంగా రూ. 75 లక్షల నష్టం వచ్చింది. దీనికి తోడు, స్పెషల్ బస్సులపై వసూలు చేయాల్సిన 18 శాతం జీఎస్టీని కూడా వదిలేయడంతో ప్రభుత్వానికి మరో రూ. 72 లక్షల గండి పడింది.
బీసీ మహాసభలోనూ అదే తీరు..
2022 డిసెంబరులో విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ మహాసభ విషయంలోనూ ఇదే తంతు కొనసాగింది. నామినేటెడ్ ప్రతినిధుల కోసం జిల్లాల నుంచి 1,439 బస్సులను వాడారు. వీటికి కూడా స్పెషల్ ఛార్జీలకు బదులు కేవలం సాధారణ ఛార్జీలనే వసూలు చేశారు. ఫలితంగా ఆర్టీసీ రూ. 91 లక్షలు నష్టపోగా, జీఎస్టీ కట్టించుకోనందున ప్రభుత్వానికి మరో రూ. 85 లక్షల గండి పడింది. మొత్తంగా ఈ రెండు సభల వల్ల ఆర్టీసీకి రూ. 1.66 కోట్లు, జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ. 1.57 కోట్ల భారీ నష్టం జరిగింది.
ప్రమాదాల పరిహారం వసూళ్లలోనూ అదే తీరు..
ఆర్టీసీలో తిరిగే అద్దె బస్సులు ఏవైనా ప్రమాదాలకు కారణమైతే, బాధితులకు నష్టపరిహారం (క్లెయిమ్స్) చెల్లించాల్సిన బాధ్యత ఆ బస్సు యజమానులదే. ఒకవేళ ముందుగా ఆర్టీసీ ఆ డబ్బులు చెల్లించినా, తర్వాత దాన్ని బస్సు ఓనర్ల నుంచి రికవరీ చేయాలి. కానీ, పలు ప్రమాద కేసులకు సంబంధించి మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్లో ఆర్టీసీ ఏకంగా రూ. 1.58 కోట్లు డిపాజిట్ చేసినా.. ఆ మొత్తాన్ని సంబంధిత బస్సు ఓనర్ల నుంచి తిరిగి రాబట్టలేదు. అసలు డబ్బులు పక్కనపెడితే.. కనీసం ఆ డబ్బుపై వచ్చే వడ్డీని లెక్కేసుకున్నా ఆర్టీసీ మరో రూ. 76 లక్షలు నష్టపోయింది.











Leave a Reply